TN 24X7 - వార్తలు / : విద్యాసంత్సరానికి గాను పదో తరగతిలో సీబీఎస్సీని తాత్కాలికంగా తొలగిస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం సెప్టెంబర్ 16న ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. గత ప్రభుత్వం హయాంలో వెయ్యి పాఠశాలల్లో సీబీఎస్సీ సిలబస్ను ప్రవేశ పెట్టింది. దీనిని 2024-25 విద్యాసంవత్సరంలోనూ అమలు చేస్తామని చెప్పింది. అయితే ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారనే కారణం చేత దీనిని తాత్కాలికంగా తొలగిస్తూ నిర్ణయం తీసుకుంది. ఇటీవల సీబీఎస్సీ విద్యార్థులకు సామర్థ్య పెంపు పరీక్ష నిర్వహించగా ఏ ఒక్కరు మెరుగైన ప్రతిభ కనబరచలేదని విద్యాశాఖ గుర్తించింది. దీంతో వారి సామర్థ్యాల మెరుగుకు వెయ్యి సీబీఎస్సీ పాఠశాలల్లోని పదో తరగతి విద్యార్థులకు ఈ విద్యాసంవత్సరం రాష్ట్ర బోర్డు పరిధిలోనే పరీక్షలు జరుగుతాయని విద్యాశాఖ ఉత్తర్వుల్లో పేర్కొంది. అందులో భాగంగా ఇప్పటికే ముద్రించిన పాఠ్యపుస్తకాలను నేరుగా ఆయా జిల్లాలకు తరలిస్తున్నారు. సీబీఎస్సీ విద్యార్థులందరికీ ప్రత్యేక తరగతులు నిర్వహించి రాష్ట్ర సిలబస్ బోధించాలని రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ సెప్టెంబర్ 16న ఉత్తర్వులు జారీ చేసింది. అయితే విద్యా సంవత్సరం ప్రారంభమై 4 నెలలు గడుస్తుండటంతో ఇప్పటివరకు ఆయా పాఠశాలల్లో సీబీఎస్సీ సిలబస్నే బోధించారు. ప్రభుత్వం తాజా నిర్ణయంతో ఈ విద్యార్థులపై ఒత్తిడి పడనుంది. నిజానికి గత విద్యాసంవత్సరం మార్చి నుంచే సీబీఎస్సీ పాఠాలు బోధించడం ప్రారంభించారు. ఇప్పటికే సిలబస్ 50 శాతం పూర్తి చేశారు. తాజా ఉత్తర్వుల వల్ల అటు విద్యార్థులు, ఇటు ఉపాధ్యాయుల్లో గందరగోళం నెలకొంది. మళ్లీ మొదటి నుంచి కొత్త పుస్తకాల్లోని తెలుగు పాఠాలు చెప్పాలంటే సమయం సరిపోదని వాపోతున్నారు.
Admin
TN 24X7