TN 24X7 - వార్తలు / : వరద కారణంగా బుడమేరు వరద మళ్లింపు కాలువ (బీడీసీ) ఎడమ కట్టకు పడిన గండ్ల పూడ్చివేత పనులు యుద్ధ ప్రాతిపధికన కొనసాగుతున్నాయి. మొత్తం 3 ప్రధాన గండ్లలో ఇప్పటికే 2 గండ్లు పూడ్చగా అతి పెద్దదైన మూడో గండి పూడ్చివేత శనివారం ఉదయానికి పూర్తవుతుందని అధికారులు భావిస్తున్నారు. మద్రాసు 6వ బెటాలియన్ నుంచి 120 మంది జవాన్లు వచ్చారు. తాత్కాలికంగా ఇనుప రాడ్లతో వంతెనలా కట్టారు. అందులో భారీ రాళ్లు వేసి పూడుస్తున్నారు. గేబియాస్ బుట్టల (ఇనుప చువ్వలతో బుట్టల్లా చేసిన దానిలో పెద్ద పెద్ద రాళ్లతోనూ ..ఇసుకతోనూ నింపుతారు) ద్వారా వారు గండ్లు పూడుస్తున్నారు. ఈ బుట్టలను పటిష్ఠం చేసేందుకు 4 మీటర్ల వరకూ రక్షణ కట్టకడతామని ఆర్మీ, జల వనరుల శాఖ వర్గాలు వెల్లడించాయి. వెలగలేరు హెడ్ రెగ్యులేటర్ నుంచి 4వ కిమీ వద్ద 60 మీటర్లు, 4.1 కిమీ వద్ద 50 మీటర్ల మేర పడిన గండ్లలో 4.1, 4 కిమీ వద్ద ఏర్పడిన గండ్లను శుక్రవారం మధ్యాహ్నానికి పూడ్చివేశారు. 3.9వ కిమీ వద్ద పడిన 100 మీటర్ల గండిని ఆర్మీ జవాన్లు సాయంత్రానికి 20 శాతం వరకు పూడ్చారు. గురువారం ఉదయం కేవలం 4,500 క్యూసెక్యుల ఉన్న నీరు.. బుధవారం రాత్రి కురిసిన వర్షానికి గురువారం సాయంత్రానికి 9 వేలకు చేరుకుంది. వరద పెరిగినా, వర్షం ఆటంకం కలిగించినా, కట్టలు జారుతున్నా పనులు మాత్రం ఆపకుండా ముందుకు కొనసాగిస్తున్నారు.
Admin
TN 24X7